శ్రీకృష్ణుడు, కుచేలుడిల స్నేహబంధం
కుచేలుడు అసలు పేరు సుధాముడు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. కుచేలుడు కూడాసాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు, అక్కడ శ్రీకృష్ణుడికి కుచేలుడికి మైత్రి బంధం ఏర్పడుతుంది. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు.
కుచేలుడికి వివాహం జరుగుతుంది.ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది.ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు, చివరికి పాపం ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, "మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారు కదా అతనో గొప్ప ప్రభువు ఐశ్వర్యవంతుడు అని. అతనిని కలిసి సహాయం అడిగితే కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ?" అని ఎంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు సరే అని ఒప్పుకొని ఎంతో ఆనందంగా కుచేలుడు ద్వారక బయలుదేరుతాడు. కుచేలుడు తనలో తాను , "ధనమేమి దొరకక పోయినా, యీ నెపంతో నైనా చాలాకాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది" అని అనుకున్నాడు. కుచేలుడు ద్వారకా నగరము బయలు దేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్నఅటుకులమూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారక నగరము చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలురాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడతాడు. తన మదిలో లోక రక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంద లేదా అని కుచేలుడు అనుకుంటాడు.
దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి, రెండు చేతులూ ముందుకు చాచి వెళ్లి, కుచేలుని కౌగిలించుకుని. కుచేలుడిని లోనికి తీసుకుపోయి, ఆసనమిచ్చి, కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు పై చల్లుకొంటాడు దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు.ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు.
సపర్యలు అయ్యాక కుచేలుడీతో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి మన గురు పత్ని దర్భలు తెమ్మని పంపితే వర్షము పడడం వల్ల ఎంతకు రాక పోవడం వల్ల మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని కుచేలుడితో అంటాడు. ఈ విధంగా చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ యిద్దరు మిత్రులూ మురిసిపోయారు.తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైన తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచు తుంటే, కృష్ణుడే మూట తీసుకొని విప్పుతూ రుక్మిణితో, "చూసేవా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడు" అని చెప్తూ, అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి , మరొ పిడికెడు వేసుకోబోయాడు, అప్పుడు రుక్మిణి, "ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి యిహంలోనూ,పరంలోనూ సకలసంపదలూ ఏర్పడ్డాయి, ఇంకొక్క పిడికెడు అటుకులు తింటే ఏం ఇస్తారో నాకు తెలుసు చాలు" అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా, సరే అని ఊరుకున్నాడు. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు.
కుచేలుడుఇంటికి వస్తూ, తోవలో తన భార్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి"అరెరే, అ పరమసంతోషంలో మా ఆవిడ మరీమరీ చెప్పినది కృష్ణుని అడుగనే లేదు. ఐనా, ఎలా నోరు విప్పి నాకిది కావాలి అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు. అని తృప్తిగా అడుగులు వేసాడు.
ఇంటి దరిదాపులకి చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. నా నివాసం ఏమైంది అని వెతుకుతూ కుచేలుడు వస్తూండగా నౌకరులు ముందుకు వచ్చి, " దయచేయండి స్వామీ" అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్లగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య యెదురై, "స్వామీ! దయచేయండి" అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూన్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణపరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది. అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితుడైన శ్రీకృష్ణ భగవానునికి కుచేలుడు నమస్కరించాడు.

Comments
Post a Comment